చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు

  • వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని నారాయణ ప్రశ్న
  • టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను తప్పుబట్టిన వైనం
  • సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శ
సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ కావడంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని ప్రశ్నించారు. భారీ బడ్జెట్ చిత్రాల పేరుతో సామాన్య ప్రేక్షకులపై భారం మోపడం సరికాదని అన్నారు. సినిమా అనేది కేవలం వినోదం కోసమేనని... పెద్ద సినిమాలకు రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. 

ఇష్టానుసారం టికెట్ రేట్లను పెంచడం, బెనిఫిట్ షోలను నిర్వహించడాన్ని నారాయణ తప్పుబట్టారు. భారీ చిత్రాల బడ్జెట్లను చూపుతూ టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు నిర్మాతలు పదేపదే అనుమతులు కోరుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు కూడా అడగ్గానే అనుమతులు మంజూరు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారం చివరకు సామాన్య కుటుంబాలపై భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని చెప్పారు. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద ఇప్పటికీ ఎలాంటి పాలసీ లేదని విమర్శించారు. ఇష్టానుసారం టికెట్ రేట్లను పెంచుతూ సామాన్య ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.

Chiranjeevi
CPI Narayana
Tollywood
Telugu cinema
Movie tickets
Ticket prices
Film industry
Benefit shows
Movie budgets
Andhra Pradesh

More Telugu News